గ్రిగ్ పోటీలు ప్రారంభం
ప్రజాశక్తి ఇందుకూరుపేట : మండలంలోని నరసాపురం ఎంవిఆర్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నల్లపరెడ్డి సేవాట్రస్టు సహకారంతో స్థానిక నేత దువ్వూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి తోడ్పాటుతో ఇందుకూరుపేట బాలికల ఉన్నత పాఠశాల సౌజన్యంతో 98వ గ్రిగ్ పోటీలు ఘనంగా ప్రారంభించారు. తొలుత కోపరేటివ్ సొసైటీ చైర్మన్ మావులూరు శ్రీనివాసులరెడ్డి కోవూరు, సిఐ రామకృష్ణారెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి సంయుక్తంగా జాతీయ పతాక ఆవిష్కరణ, టోర్నమెంట్ పతాకావిష్కరణ జరిపి క్రీడాజ్యోతి ద్వారా క్రీడలను ప్రారంభించారు. అనంతరం విశిష్ట అతిధులు విద్యార్థులు నిర్వహించిన పెరేడును తిలకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కళ్యాణ్రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు ఉన్నత ఆశయంతో పాఠశాల జిల్లా, రాష్ట్ర, జాతీయ ప్రపంచ స్థాయికి చేరాలన్న సంకల్పం ఉండాలన్నారు. క్రీడాకారులను, నిర్వాహకులను అభినందించారు. స్పోర్ట్స్ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ కోవూరు జోన్ పరిధిలో ఐదు మండలాల ద్వారా 37 టీములు 1500 మంది క్రీడాకారులతో మూడు రోజులు వివిధ విభాగాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు, వ్యాయామ ఉపాధ్యాయులు పల్లవి, ముజీర్ తెలిపారు. కార్యక్రమంలో మండల కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మావులూరు శ్రీనివాసులరెడ్డి, జెడ్పి వైస్చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి, వైసిపి నాయకులు ఉడతా వెంకటశేషయ్య, గూడూరు ప్రభాకర్రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, ఝాన్సీలతా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










