ప్రజాశక్తి-పీలేరు: 2021-22 విద్యా సంవత్సరం జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థికి దాత బంగారు పతకాన్ని బహుకరించారు. పీలేరు పట్టణ అయ్యప్పరెడ్డి కాలనీ, జడ్పీ బాలికోన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వి.నందిని అనే విద్యార్థిని 600/518 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. పాఠశాల 59వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఆ పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ తన సొంత ఖర్చులతో ప్రొఫెసర్లు అయిన తన కుమార్తె స్వర్ణలత, అల్లుడు హరిబాబు చేతుల మీదుగా రెండు గ్రాముల బంగారు పతకం నందినికి బహూకరించారు. ఈ సందర్భంగా జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.జయమ్మ మాట్లాడుతూ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ ఈ పాఠశాలలో ఎక్కువ కాలం పనిచేసి, పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థినికి గోల్డ్ మెడల్ బహుకరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారన్నారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విద్యార్తులు బంగారు పతకం పొందాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థిని వి.నందిని, విద్యార్థిని తల్లిదండ్రులు, పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.










