Dec 18,2021 17:23

సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ పార్టీతో ప్రయాణించిన సీనియర్‌ నేత.. ఉన్నట్టుంది టీఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభకు వెళ్లారు... మళ్లీ తన సొంతగూటికే వెళ్తున్నారు... ఇప్పటికే ఆయనెవ్వరు అర్ధం అయ్యే ఉంటుంది... ఆయనే ధర్మపురి శ్రీనివాస్‌... ఢిల్లీలో నేరుగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యి.. పాత పార్టీలోకి వచ్చేందుకు లైన్‌ క్లియర్‌ చేసుకున్నారు డిఎస్‌ . డిఎస్‌ చేరికపై ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాతోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరి స్పందన ఎలా ఉన్నా.. ఆయన తిరిగి కాంగ్రెస్‌లోకి ఎందుకొస్తున్నారన్నది జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.
అందులో ఒకటి తన ఇద్దరు కుమారులను రాజకీయంగా సెటిల్‌ చేసేందుకు.. కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్నప్పుడే డిఎస్‌ ప్రయత్నించారు. కానీ.. అవేమీ పెద్దగా వర్కవుట్‌ కాలేదు. ఇంతలో ఒక కుమారుడు బీజేపీ నుంచి ఎంపీ అయ్యారు. పెద్ద కుమారుడు సంజరు మేయర్‌గా పనిచేసినా.. ఇంకా నిలదొక్కుకోలేదు. తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు 4 నెలల క్రితం పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని కలిశారు సంజరు. ఇంకా ఫైనల్‌ కాలేదు. సంజరు మాత్రం వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారట. డిఎస్‌ కోరిక కూడా ఇదే అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకోవైపు మరో కుమారుడు బీజేపీ ఎంపీగా ఉండి.. డిఎస్‌ కాంగ్రెస్‌ అంటే కేడర్‌ ఒప్పుకొంటుందా అనేది మరో ప్రశ్న. తెలంగాణ ఏర్పాటయ్యాక కాంగ్రెస్‌కు అవసరమైన సమయంలో డిఎస్‌ వెళ్లిపోయారనే ప్రచారం పార్టీలో ఉంది. ఈ రెండు విషయాలను రీఎంట్రీలో ఎలా అధిగమిస్తారన్నది చర్చ. వీటన్నింటి మధ్య కాంగ్రెస్‌లోకి డిఎస్‌ రాక జిల్లా రాజకీయాలను మలుపు తిప్పుతుందో లేదో చూడాలి.