భూ సమస్యపై కావలి ఆర్డిఒ విచారణ
ప్రజాశక్తి-అల్లూరు : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో శనివారం కావలి ఆర్డిఒ శీనా నాయక్ పలు భూ సమస్యలపై విచారణ చేపట్టారు. మండలంలోని నార్త్ ఆములూరు గ్రామానికి చెందిన పెయ్యల వీరయ్య అనే వ్యక్తి ఆ గ్రామంలో 317 సర్వే నంబర్లో భూ వివాదానికి సంబంధించి ఇటీవల స్పందనలో ఫిర్యాదు చేయగా ఆ సమస్యపై వెంటనే విచారణ చేపట్టారు. తదుపరి స్థానిక డిగ్రీ కళాశాలలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎంఎల్సి ఎన్నికల పోలింగ్ స్టేషన్లను పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం నార్త్ ఆములూరు గ్రామంలోని జగనన్న లే అవుట్లలో నూతనంగా నిర్మిస్తున్న గృహాలను పరిశీలించి ఉగాది నాటికి అంతా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీరామకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్ చెంచయ్య, సీనియర్ అసిస్టెంట్ సుధీర్, మండల సర్వేయర్ అన్రూప్, విఆర్ఒ పుల్లారావు తదితరులున్నారు.










