Nov 12,2020 00:19

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బండారు

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి భాగోతాలను రానున్న ఆరునెలల్లో వైసిపి నాయకులు బయటపెడతారని టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. విశాఖలో భూములు కొనుగోలు చేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు వైసిపి ప్రజాప్రతినిధులు, వారి బంధువులు పాల్పడ్డారని తెలిపారు. టిడిపి కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ప్రకటనకు ముందు నుంచే నగర ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారన్నారు. వైసిపి ప్రభుత్వ 17 నెలల కాలంలో జిల్లాలో 55వేల లావాదేవీలు, మధురవాడ, ఆనందపురం, భీమిలి సబ్‌రిజిస్ట్రార్ల పరిధిలో 27,042 క్రయవిక్రయాలు జరిగాయన్నారు. ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌పై సిబిఐ విచారణ చేపట్టాలన్నారు. మేఘ కృష్ణారెడ్డి బీచ్‌రోడ్‌లో కార్తీకవనం, విజయసాయిరెడ్డి అల్లుడైన అరబిందో ఎమ్‌డి బే పార్కు కొనుగోలు చేయడం, నగరంలోని జీవి అనే ఆడిటర్‌, మరో ఎంపీ కలిసి హయగ్రీవ ఇన్‌ఫ్రా ప్రాజెక్టును తీసుకోవడం ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ కిందకు వస్తోందని పేర్కొన్నారు.