Nov 08,2023 00:11

అన్ని డివిజన్లలో వైద్యశిబిరాలు : మేయర్‌

అన్ని డివిజన్లలో వైద్యశిబిరాలు : మేయర్‌
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:
నగరంలోని అన్ని డివిజన్లలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి పేదవానికి మెరుగైన ఆరోగ్యసేవలు అందాలనే లక్ష్యంతో జగనన్న వైద్య రంగంలో విప్లవాతకమైన మార్పు తీసుకువచ్చారని నగరపాలక సంస్థ మేయర్‌ డాక్టర్‌ శిరీష పేర్కొన్నారు. స్థానిక నెహ్రునగర్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో మంగళవారం ఉదయం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో మేయర్‌ పాల్గొని వైద్యానికి వచ్చిన పేషెంట్లకు హెల్త్‌చెకప్‌లు నిర్వహించారు. అనంతరం ఆరోగ్య సురక్ష శిబిరాలలో ప్రజలకు సురక్ష కిట్లను పంపిణీ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం వైద్యరంగానికి ఎంతో ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. జగనన్న ఆరోగ్యసురక్ష అనే కార్యక్రమం ద్వారా అందరికీ ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆరోగ్య సురక్ష శిబిరాలలో స్పెషలిస్ట్‌ వైద్యులు పాల్గొంటున్నారని వెల్లడించారు. కార్పొరేటర్‌ బసవ గీత, ఆరోగ్య అధికారి యువ అన్వేష్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ రవి, వైద్యులు, ఏఎన్‌ఎంలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.