ప్రజాశక్తి-కొత్తచెరువు అగ్రిల్యాబ్ ద్వారా నియోజకవర్గంలోని రైతులందరికీ మెరుగైన సేవలు అందించనున్నట్లు తిరుపతి రీజినల్ కోడింగ్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ మల్లికార్జున తెలిపారు. గురువారం కొత్తచెరువులోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఈ కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు సంబంధించిన ఎరువులు, పురుగుల మందులు, ఇతర పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేగాకుండా రైతులు ఇక్కడే భూసార పరీక్షలు నిర్వహించుకుని అధికారుల సలహాలు, సూచనలతో పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ ఎడిఎ స్వయంప్రభ, వ్యవసాయ అధికారి నటరాజు, ఎఇఒ ఉపేందర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : ధర్మవరం మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ ఆగ్రీ టెస్ట్ ల్యాబ్లో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, మందుల నాణ్యత పరీక్షలను చేయాలని తిరుపతి రీజినల్ కోడింగ్ సెంటర్ అగ్రికల్చర్ అఫ్ డిప్యూటీ డైరెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈమేరకు గురువారం మార్కెట్ యార్డులోని నూతనంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ అగ్రీటెస్ట్ ల్యాబ్ను సందర్శించారు. ఇందులో భాగంగా ల్యాబ్లో అన్ని పరీక్షలకు సంబంధించి స్టాప్, పరికరాలను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారి వైవి సుబ్బారావు, ఎడిఎ క్రిష్టయ్య, ఎఒ చిన్నవీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : పట్టణంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ టెస్టింగ్ ప్రయోగశాలను తిరుపతి రీజినల్ కోడింగ్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మల్లికార్జునయ్య గురువారం సందర్శించారు. ఇందుంలో భాగంగా సెంటర్లోని ఎరువులు, విత్తనాలు నాణ్యత పరీక్షలు, మౌలిక వసతులపై ఆరాతీశారు. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు ఈ ప్రయోగశాలలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు స్వయంప్రభ, మండల వ్యవసాయ అధికారి సురేంద్రనాయక్, ల్యాబ్ సహాయకులు చక్రపాణి రెడ్డి, నరసింహ మూర్తి ,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
అగ్రి టెస్ట్ ల్యాబ్ను పరిశీలిస్తున్న అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ మల్లికార్జున










