Oct 06,2023 21:52

- వరల్డ్‌ హెరిటేజ్‌ ఇరిగేషన్‌ స్ట్రక్చర్‌ పురస్కారానికి ఎంపిక
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విజయవాడలోని కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ(ఐసిఐడి)కు సంబంధించిన వరల్డ్‌ హెరిటేజ్‌ ఇరిగేషన్‌ స్ట్రక్చర్‌ (డబ్ల్యూహెచ్‌ఐఎస్‌) అవార్డుకు ఎంపికైంది. రాష్ట్ర జలవనరుల శాఖముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ఇన్‌సిఐడి డైరెక్టరు అవంతి వర్మ శుక్రవారం లేఖ రాశారు. వ్యవసాయంలో సమర్ధవంతంగా నీటిని వినియోగించే హెరిటేజ్‌ స్ట్రక్చర్లను గుర్తించేందుకు ఈ రంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐసిఐడి ఈ అవార్డులను ఏర్పాటు చేసిందని తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఐఎస్‌-2023 అవార్డులకు ఐసిఐడి, ఐఎన్‌సిడిల తరపున నామినేషన్లు కోరారు. వచ్చిన వాటిలో దేశం నుంచి ఎంపికైన నాలుగు నిర్మాణాల్లో ప్రకాశం బ్యారేజితోపాటు ఒడిశాలోని బలిదిహా ప్రాజెక్టు, జయమంగళ ఆనకట్టలు, తమిళనాడులోని శ్రీవాయికుంటం ఆనకట్ట ఈ అవార్డుకు ఎంపికైనట్లు వివరించారు. నవంబరు 2 నుంచి 8 వరకూ విశాఖపట్నంలో జరిగే 25వ ఐసిఐడి కాంగ్రెస్‌, 74వ ఐఇసి సమావేశంలో ఈ అవార్డులను ఆయా రాష్ట్రాలకు ప్రదానం చేస్తామన్నారు.