Jun 18,2023 09:17

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జాతీయ నీటి అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం లభించింది. శనివారం నాడిక్కడ విజ్ఞాన్‌ భవన్‌లో నాల్గవ జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డులను ఉప రాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖర్‌ ప్రదానం చేశారు. ఈ ర్యాంకింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి రెండు, మూడు స్థానాల్లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. మొత్తం 11 విభాగాల్లో పురస్కారాలు అందజేశారు. జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, సహాయ మంత్రులు బిశ్వేశ్వర్‌ తుడు, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ పాల్గొన్నారు. రాష్ట్రం తరపున జలవనరుల అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ పురస్కారం అందుకున్నారు. ఉత్తమ పాఠశాల విభాగంలో నంద్యాల జిల్లా చాగలమర్రిలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం రెండో స్థానం, ఉత్తమ పరిశ్రమల విభాగంలో తిరుపతికి చెందిన సిసిఎల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ మూడోస్థానం పొందాయి. ఉత్తమ ప్రభుత్వేతర సంస్థల విభాగంలో ఆనంతపురంలోని ఆక్టా ఫ్రెటర్నా ఎకాలజీ సెంటర్‌కు స్పెషల్‌ కన్సోలేషన్‌ ప్రైజ్‌ లభించింది.
           ఉత్తమ జిల్లాల్లో తెలంగాణాలోని ఆదిలాబాద్‌కు మూడో స్థానం లభించింది. గ్రామ పంచాయతీ కేటగిరిలో దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామానికి అవార్డు దక్కింది. నీటి విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించినందుకు భద్రాది కొత్తగూడెం జిల్లా జగన్నాథపురానికి అవార్డు వరించింది. ఉప రాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖర్‌ చేతుల మీదుగా జగన్నాథపురం సర్పంచ్‌ గడ్డం భవాని, పంచాయతీ కార్యదర్శి షేక్‌ ఇబ్రహీం ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీకి రెండో అవార్డు దక్కింది.