Oct 30,2023 17:47

అమరావతి: స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డుపై(ఎస్‌ఐపీబీ) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, కాకాని గోవర్ధన్‌ రెడ్డి, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్‌, సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మొత్తంగా రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్‌ పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికరంగంలో అనూహ్య మార్పులు వస్తున్నాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అవగతం చేసుకోవాలని, ఆ మేరకు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. 'పరిశ్రమల పట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయాలి. పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం నుంచి వేగంగా స్పందిస్తున్నాం. ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నాం. అనుమతులు, క్లియరెన్స్‌ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక వర్గాలనుంచి వచ్చే ప్రతిపాదనల పట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరుచేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాలి.
విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలి. గత ప్రభుత్వంలో కన్నా పరిశ్రమలకు పోత్సాహకాల విషయంలో ఈ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మేలు చేకూర్చాం. ఎంఎస్‌ఎంఈల రంగానికి పునరుజ్జీవం ఇచ్చాం. ఇన్సెంటివ్‌లు ఇస్తూ వారికి చేదోడుగా నిలిచాం. ఎంఎస్‌ఎంఈల పట్ల చాలా సానుకూలతతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎక్కువమంది వీటిపై ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి.. వీటిని కాపాడుకోవడం ప్రభుత్వంమీదున్న బాధ్యత' అని సీఎం తెలిపారు.