ప్రజాశక్తి- విజయపురి సౌత్ (పల్నాడు జిల్లా) : తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్ జలాశయం కుడి కాలువ 4వ గేటు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీహరి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలువ ద్వారా పల్నాడు, ప్రకాశం జిల్లాలకు పది రోజుల పాటు నీటి విడుదల కొనసాగనుందని తెలిపారు. గంటగంటకూ నీటి విడుదల పరిమాణాన్ని పెంచుతామన్నారు. తాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేస్తున్న ఈ నీటిని రైతులు సాగునీటికి వినియోగించరాదని కోరారు. ఈ కార్యక్రమంలో కుడి కాలువ డిఇ మురళీధర్, ఎఇ బాబుమియా తదితరులు పాల్గొన్నారు.











