ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :ఎగువ నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయంకు వరద ఉధృతి కొనసాగుతోంది. సాగర్ జలాశయ గరిష్టనీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 570 అడుగులు నమోదైంది. ఇదే ప్రవాహం కొనసాగితే రెండు, మూడు రోజుల్లో జలాశయం నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈనెల 10న గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు. మరోవైపు పులిచింతలకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతలలో గరిష్ట నీటి నిల్వ సామర్ధ్యం 45.77 టిఎంసిలు కాగా ప్రస్తుతం 40.40 టిఎంసిలు నమోదైంది. 31,501 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో 30,531 క్యూసెక్కుల ఉండగా.. అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.










