Dec 26,2022 21:35
  • కొచ్చర్‌ దంపతులకు కస్టడీ కొనసాగింపు..!
  • సిబిఐ కోర్టును కోరిన అధికారులు

ముంబయి : క్విడ్‌ప్రోకో, మానిలాండరింగ్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న చందా కొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌ దూత్‌లకు ఉచ్చు బిగుస్తోంది. సోమవారం దూత్‌ను సిబిఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. వీడియోకాన్‌ - ఐసిఐసిఐ బ్యాంక్‌ మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే కొచ్చర్‌ దంపతులను కస్టడీకి తీసుకోగా.. మూడు రోజుల విచారణ ముగిసింది. వేణుగోపాల్‌ అరెస్ట్‌ నేపథ్యంలో మరింత సమగ్రమైన విచారణకు వీలుగా కొచ్చర్‌ దంపతులు సహా దూత్‌ను మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు సిబిఐ ప్రత్యేక కోర్టును కోరారు. ముగ్గురిని కలిపి ఓకేసారి విచారిస్తే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కోర్టుకు సిబిఐ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంగళవారం (నేడు) నిర్ణయం ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. చందాకొచ్చర్‌ ఐసిఐసిఐ బ్యాంక్‌ సిఇఒగా ఉన్న కాలంలో వీడియోకాన్‌ కంపెనీ రూ.3200 కోట్లకుపైగా రుణం తీసుకుంది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌, ఆర్‌బిఐ మార్గదర్శకాలు, బ్యాంక్‌ రుణ విధానాన్ని ఉల్లంఘించి ఐసిఐసిఐ బ్యాంక్‌ ఈ అప్పు ఇచ్చింది. దీంతో 2012లో దీపక్‌ కొచ్చర్‌ కంపెనీకి రూ.64 కోట్ల సొమ్మును వీడియోకాన్‌ ముట్టజెప్పింది. వీడియోకాన్‌ పలు బ్యాంక్‌లకు రూ.40వేల కోట్లు ఎగ్గొట్టింది.. అందులో ఈ రూ.3200 కోట్లు కూడా భాగమే.