Sep 11,2023 21:30

హైదరాబాద్‌ : ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ తయారీలో ఉన్న రఘువంశీ గ్రూప్‌, పార్‌ ఈస్ట్‌ల భాగస్వామ్యంలోని స్టార్టప్‌ సంస్థ అరోబోట్‌ కొత్తగా సాయుధ దళాల కోసం మానవరహిత గైడెడ్‌ వెహికిల్‌ (యుజివి)ను అభివృద్థి చేసినట్లు వెల్లడించింది. ఇది సైన్యానికి రవాణా, నిఘా, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు, ఉపరితలాల్లో ఎంతో సహాయపడుతుందని పేర్కొంది. ఇది 200 కిలోల వరకు బరువును 30 డిగ్రీల వ్యూతో లక్ష్యాన్ని నిర్దేశించుకోగలదు. దీనికి అదనపు ఎటాచ్‌మెంట్లు పెడితే ఇంకా అనేక ఇతర విధులను కూడా చేయగలదని ఆ సంస్థ తెలిపింది. ''డిజిటలైజేషన్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమేషన్‌ రంగాల్లో మా స్టార్టప్‌ దూసుకెళ్తోంది. అత్యాధునిక పరిష్కారాలను అందించడం ద్వారా, ఆధునిక యుగంలో అభివృద్థి చెందడానికి అవసరమైన సాధనాలతో పరిశ్రమలను శక్తివంతం చేయాలని అరోబోట్‌ యోచిస్తోంది'' అని అరోబోట్‌ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ రవి ఆచంట తెలిపారు. వచ్చే ఏడాదిలోగా కొత్తగా 100 మంది ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ''రఘువంశీ గ్రూపులో మా విలువైన వినియోగదారులకు వినూత్న సాంకేతిక పరిష్కారాలను అందించడానికి మాకు ఎనలేని నిబద్ధత ఉంది. మిస్సైల్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రో ఆప్టిక్స్‌, జెట్‌ ఇంజిన్లు, లోయిటరింగ్‌ మారణాయుధాలు, డ్రోన్లు, మరెన్నో రంగాలలో అత్యాధునిక ఉత్పత్తులను అభివద్ధి చేయడానికి మాకు వీలు కల్పించే అన్ని ప్రధాన తయారీ డొమైన్లలో అంతర్గత నైపుణ్యాన్ని కలిగి ఉన్న కొన్ని సంస్థలలో మేము ఉండటం నిజంగా గర్వకారణం'' అని రఘువంశీ గ్రూపు ఎండి వంశీ వికాస్‌ పేర్కొన్నారు.