Dec 06,2022 20:46

న్యూఢిల్లీ : కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ మరో విశేష ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. దీని సాయంతో తాము ప్రభుత్వ అధికారులమని, మంత్రి, ఎంఎల్‌ఎలమని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేసే కేటుగాళ్లను సులభంగా గుర్తించవచ్చని పేర్కొంది. సంస్థ ఆవిష్కరించిన ఈ ప్రభుత్వ డిజిటల్‌ డైరెక్టరీ ఫీచర్‌తో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లను సులభంగా గుర్తించవచ్చని ట్రూకాలర్‌ తెలిపింది. తమ గవర్నమెంట్‌ డిజిటల్‌ డైరెక్టరీ ఫీచర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఫోన్‌ నెంబర్లు ఉన్నాయని తెలిపింది. వినియోగదారులు తమ ఫోన్లలో ట్రూకాలర్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసి ఈ కొత్త ఫీచర్‌ను పొందవచ్చని తెలిపింది.