ప్రజాశక్తి-అమరావతి : కృష్ణా జలాల పంపిణీపై నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు ట్రిబ్యునల్ విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటాలు తేల్చనుంది. ట్రిబ్యునల్ విధివిధానాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని ఏపీ ఆందోళన చెందుతోంది. నదీ జల వివాదాల చట్టం ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అదనపు బాధ్యతలు అప్పగించే అధికారం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉంది. విభజన చట్టం సెక్షన్ 89(ఏ)-89(బీ) కింద ట్రిబ్యునల్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశం పరిశీలనలో ఉంది. ఇప్పుడు కొత్త అంశాలు చేర్చి వాటాలు పంచాలని సూచించడం తగదు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది.










