Dec 16,2022 21:00

భారత ఎగుమతులు డీలా
వచ్చే ఏడాది సవాళ్లే..
ఉత్పత్తి తగ్గింపు
ఉద్యోగులకు కోత

న్యూఢిల్లీ : భారత వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. విదేశాల్లో డిమాండ్‌ లేమితో ఈ రంగం ఎగుమతులు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్‌ ఇతర పెద్ద మార్కెట్లలో వస్త్రాలపై వ్యయాలు తగ్గాయి. ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ద్రవ్యోల్బణం పెరగడంతో వినియోగదారులు దుస్తులపై ఖర్చు తగ్గించుకుంటున్నారని రాయిటర్స్‌ ఓ రిపోర్టులో తెలిపింది. దీంతో 200 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.16.54 లక్షల కోట్లు) విలువ చేసే భారత వస్త్ర, దస్తుల పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అధికారులు పేర్కొన్నట్లు వెల్లడించింది.
''స్థూల ఆర్థిక వ్యవస్థ సాపేక్షంగా బలంగా ఉండటంతో ప్రధాన ఆర్థిక వ్యవస్థలను అధిగమిస్తున్నప్పటికీ టెక్స్‌టైల్‌ పరిశ్రమ మాత్రం తిరోగమనంలో ఉంది. ఈ రంగంపై దాదాపుగా 4.5 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. అమ్మకాలు, ఎగుమతులు లేక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ పరిశ్రమలో భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.'' అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తిలో 22 శాతం వాటా ఎగుమతులదే. వీటి ఎగుమతులు వరుసగా ఐదు నెలల నుంచి పడిపోతున్నాయి. ప్రస్తుత ఏడాది నవంబర్‌లో ఎగుమతులు 15 శాతం పతనమై 3.1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.25వేల కోట్లకు) పరిమితమయ్యింది.
''ప్రస్తుత ఏడాది ప్రారంభంలో ఆశాజనక తయారీ, విక్రయాలు జరగ్గా.. ప్రస్తుతం డిమాండ్‌ లేమితో అనేక వస్త్ర పరిశ్రమలు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఉత్పాదనలో 4.3 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ప్రధాన మార్కెట్ల నుండి ఆర్డర్లు గణనీయంగా తగ్గినందున మేము కనీసం రాబోయే ఆరు నెలల వరకు కష్టతరమైన సమయాలను చూడొచ్చు'' అని వస్త్ర ఎగుమతుల ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నరేన్‌ గోయెంకా పేర్కొన్నారు. తిరుపుర్‌లోని నైట్‌వేర్‌ తయారీ హబ్‌లో 6 లక్షల మంది పని చేస్తున్నారు. కాగా ఇక్కడ ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యం 50 శాతానికంటే దిగువకు పడిపోయింది. దీంతో ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాలంతో దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగానికి తోడు ఈ రంగంలో ఉన్న ఉద్యోగాలు ఊడటం ఆర్థిక వ్యవస్థను మరింత తీవ్ర ఒత్తిడికి గురి చేయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.