Jul 07,2023 22:06

నార్త్‌జోన్‌తో దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్స్‌
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌ జోన్‌ జట్టు 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌లో నార్త్‌జోన్‌ జట్టు 211పరుగులకు ఆలౌటైంది. ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌(63), హర్షీత్‌ రాణా(38) బ్యాటింగ్‌లో రాణించారు. విజయ్ కుమార్‌కు ఐదు, సాయి కిషోర్‌కు మూడు, విద్వత్‌ కవిరప్పకు రెండు వికెట్లు దక్కాయి. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచే సమయానికి సౌత్‌ జోన్‌ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 21పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌(5), మయాంక్‌ అగర్వాల్‌(15) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్‌జోన్‌ జట్టుకు 3పరుగుల ఆధిక్యత లభించిన సంగతి తెలిసిందే. ఆలూరు కస్కా క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న మరో సెమీస్‌లో వెస్ట్‌జోన్‌ పట్టు బిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టజోన్‌ జట్టు 9వికెట్ల నష్టానికి 291పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యతతో కలిసి వెస్ట్‌జోన్‌ జట్టు ఇప్పటికే 383పరుగుల ఆధిక్యతను సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్ట్‌జోన్‌ బ్యాటర్‌ ఛటేశ్వర పుజారా(133) సెంచరీతో కదం తొక్కాడు. సూర్యకుమార్‌ యాదవ్‌(52) అర్ధసెంచరీతో మెరిసాడు. సౌరభ్‌ కుమార్‌కు నాలుగు, సరంశ్‌ జైన్‌కు మూడు వికెట్లు దక్కాయి. నేడు ఆఖరి రోజు కావడంతో రెండు సెమీఫైనల్స్‌ ఫలితాలు వెలువడనున్నాయి.