Jul 08,2023 22:03

కెనడా ఓపెన్‌ సూపర్‌500
కాల్గరీ(కెనడా): కెనడా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ా500 బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీఫైనల్లోకి భారత షట్లర్లు పివి సింధు, లక్ష్యసేన్‌ దూసుకెళ్లారు. శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పివి సింధు21-13, 21-7తో ఫాంగ్‌ జియో(జపాన్‌)పై వరుససెట్లలో నెగ్గింది. ఇంతకుముందు నాలుగుసార్లు ఫంగ్‌జితో తలపడి ఓడిన సింధు.. తొలిసారి విజయం సాధించడం విశేషం. సెమీస్‌లో సింధు.. ప్రపంచ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి, జపాన్‌కు చెందిన యమగుచితో తలపడనుండి. 28ఏళ్ల హైదరాబాద్‌కు చెందిన సింధు ముఖాముఖి పోరులో జపాన్‌ టాప్‌సీడ్‌ యమగుచిపై 14-10 రికార్డును కలిగి ఉండడం కలిసి రానుంది. ఇక పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ 21-8, 17-21, 21-10తో జులియన్‌ కర్రగి(జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గాడు. సెమీస్‌లో లక్ష్యసేన్‌ 4వ సీడ్‌, జపాన్‌కు చెందిన కెంటా నిషీమోటోతో తలపడనున్నాడు. లక్ష్యసేన్‌-నిషిమోటో మధ్య 1-1 ముఖాముఖి రికార్డుతో సమంగా ఉన్నారు.