Dec 23,2022 21:10

న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక ఫోన్‌ పే, ఇా కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లు వేరుపడ్డాయి. ఇరు సంస్థల మధ్య యాజమాన్య హక్కుల బదిలీ ప్రక్రియ ముగిసినట్లు ఆ రెండు కంపెనీలు శుక్రవారం ధృవీకరించాయి. దీంతో ఇక నుంచి ఈ రెండు సంస్థలు విడి విడిగా పనిచేయనున్నాయి. అయితే.. ఈ రెండిటిలోనూ వాల్‌మార్ట్‌ ప్రధాన వాటాదారుడిగా కొనసాగనుంది. యాజమాన్య విభజన వల్ల ఇరు కంపెనీల విలువ పెరిగి వాటాదారులకూ ప్రయోజనం చేకూరుతుందని సంయుక్త ప్రకటనలో తెలిపాయి. అక్టోబరులోనే ఫోన్‌పే తమ నమోదిత కార్యాలయాన్ని సింగపూర్‌ నుంచి భారత్‌కు తరలించింది. ఫోన్‌ పే, ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీల సింగపూర్‌ సంస్థలకు చెందిన వాటాదారులు ఫోన్‌ పే ఇండియాలో నేరుగా షేర్లను కొనుగోలు చేశారు. దాంతో ఫోన్‌ పే ఇకపై పూర్తిగా భారత్‌కు చెందిన కంపెనీగా మారనుంది. ఫోన్‌ పే ఐపిఒకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రస్తుత నిర్ణయం ఆ సంస్థ విలువను భారీగా పెంచడానికి దోహదం చేస్తుందని నిపుణుల అంచనా.