Feb 21,2023 21:55

ఐసిసి మహిళల టి20 ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్: : అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటారు. కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ తహిలా మెక్‌గ్రాత్‌ 802 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ఓపెనర్‌ స్మృతి మంధాన(755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది. మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ(613 పాయింట్లు) పదో స్థానం దక్కించుకుంది. ఇక జెమీమా రోడ్రిగ్స్‌ (599 పాయింట్లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (598పాయింట్లు) 12, 13 స్థానాల్లో ఉన్నారు. వికెట్‌ కీపర్‌ రీచా ఘోష్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకు 20వ స్థానంలో నిలిచింది. ఇక బౌలర్ల జాబితాలో స్పిన్నర్‌ దీప్తి శర్మ, ఫాస్ట్‌ బౌలర్‌ రేణుకా సింగ్‌ టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్‌ బౌలర్‌ సోఫీ ఎక్లెస్టోన్‌ (784 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. దీప్తి శర్మ (733 పాయింట్లు), రేణుకా సింగ్‌ (711 పాయింట్లు) వరుసగా నాలుగు, ఐదు ర్యాంకులు సొంతం చేసుకున్నారు. టీమిండియా బౌలర్‌ స్నే రాణా 671 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచింది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ (392 పాయింట్లు) నాలుగో ర్యాంక్‌ దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన అష్లే గార్డ్‌నర్‌ 449 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. హరులే మాథ్యూస్‌ (వెస్టిండీస్‌) రెండు, అమేలియా కేర్‌ (న్యూజిలాండ్‌) మూడు ర్యాంకులో ఉన్నారు.