- ఆర్థికశాఖ మంత్రికి పిడిఎఫ్ ఎమ్మెల్సీల వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న జులై, ఆగస్టు జీతాల బడ్జెట్ను వెంటనే విడుదల చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కోరారు. ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ శాసనమండలిలో గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. 11వ పిఆర్సి ప్రకారం పెంచిన 23 శాతం జీతాలను సిఆర్పిలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్స్ అకౌంటెంట్స్కు కూడా పెంపుదల చేయాలని కోరారు. పెండింగ్ వేతనాల బడ్జెట్ విడుదల చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జీతాలు పెరగని కేటగిరి ఉద్యోగుల జీతాలు పెంపుదలకు పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2004 సెప్టెంబరు ఒకటికి ముందు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ పథకం వర్తింపజేయాలని ప్రత్యేక ప్రస్తావన ద్వారా మండలిలో సాబ్జీ ప్రభుత్వాన్ని కోరారు.










