Sep 02,2023 14:38

ముప్పాళ్ల: పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ల పోలీసు స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి వైసిపి నేతలు వీరంగం సఅష్టించారు. వైసిపి నేతల దాడిలో ముప్పాళ్ల ఎస్సై కిషోర్‌కు గాయాలయ్యాయి. తొలుత మద్యం మత్తులో వైసిపి నేత వెంకటేశ్వర్‌రెడ్డి కారుపై సాయి, కిషోర్‌ దాడి చేశారు. వైసిపి నేత ఫిర్యాదుతో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై యువకులను అప్పగించాలంటూ అర్ధరాత్రి వైసిపి నేత అనుచరులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. స్టేషన్‌లోనే వారు సాయి, కిషోర్‌పై దాడి చేశారు. అనుచరులను స్టేషన్‌ నుంచి బయటకు పంపేందుకు యత్నించిన ఎస్సైపై వైసిపి నేత వెంకటేశ్వర్‌ రెడ్డి దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై కిషోర్‌ ముఖంతో పాటు చేతికి గాయాలయ్యాయి.ఈ ఘటనపై మాజీ మంత్రి, టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకపోతే ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దాడి చేసిన వైసిపి నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.