Jul 08,2023 22:07

విండీస్‌తో తొలి టెస్ట్‌ ఆడే భారత తుది జట్టు ఇదే!
ముంబయి: ఇప్పటికే ఇంట్రా స్క్వాడ్‌ జట్టుతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా ఆడింది. ఈ పర్యటనకు కొత్తగా ఎంపికైన యశస్వీ జైస్వాల్‌ తొలి టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేయనున్నాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడినదాన్ని బట్టి చూస్తే యశస్వీ జైస్వాల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నాడు. ఇప్పటి వరకు ఓపెనర్‌గా ఆడిన శుభ్‌మన్‌ గిల్‌ను ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌ చేయనున్నాడు. లెఫ్ట్‌ రైట్‌ కాంబినేషన్‌ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యశస్వీ జైస్వాల్‌కు ఓపెనర్‌గా మెరుగైన రికార్డు ఉండటం కూడా ఈ నిర్ణయానికి కారణమైంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రోహిత్‌, జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటారు. శుభ్‌మన్‌ గిల్‌కు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసే సత్తా ఉండటంతో అతన్ని పుజారా వారసుడిగా తీర్చిదిద్దేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లీ ఆడనుండగా.. ఐదో స్థానంలో మళ్లీ వైస్‌ కెప్టెన్సీ అందుకున్న రహానే బరిలోకి దిగనున్నాడు. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న రహానే.. ఓవర్‌సీస్‌ కండిషన్స్‌లో కీలకం కానున్నాడు. వికెట్‌ కీపర్‌ విషయంలోనూ టీమ్‌మేనేజ్‌మెంట్‌ ఎటూ తేల్చుకోలేకపోతుంది. తెలుగు తేజం కేఎస్‌ భరత్‌కు మరో అవకాశం ఇవ్వాలా? లేక ఇషాన్‌ కిషన్‌ను తీసుకోవాలా? అనేది రోహిత్‌ సేనకు తలనొప్పిగా మారింది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో అవకాశం కల్పించినా కేఎస్‌ భరత్‌ సత్తా చాటలేకపోయాడు. కీపింగ్‌లో అదరగొట్టినా.. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇచ్చే సూచనలు కనబడుతున్నాయి. స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడనుండగా.. పేస్‌ ఆల్‌రౌండర్‌గా శార్దూల్‌ ఠాకూర్‌ బరిలోకి దిగనున్నాడు. మహమ్మద్‌ సిరాజ్‌ పేస్‌ విభాగాన్ని లీడ్‌ చేయనుండగా.. మూడో పేసర్‌గా ముఖేశ్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనాద్కత్‌లో ఒకరు బరిలోకి దిగనున్నారు. పిచ్‌ కండిషన్స్‌ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. జయదేవ్‌ ఉనాద్కత్‌కే తొలి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది.