ఊడుతోన్న ఉద్యోగాలు
నూతన నియామకాలపై సందిగ్దత
ఇచ్చిన ఆఫర్ లేటర్లు తిరస్కరిస్తున్న కంపెనీలు
వాషింగ్టన్ : ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అంతర్జాతీయ, జాతీయ టెక్ సంస్థలు ఒత్తిడిలోకి జారుకుంటున్నాయి. ఉద్యోగులను తీసివేసే ప్రణాళికలతో పాటు కొత్త నియామకాలపై అచీతూచీ వ్యవహారిస్తున్నాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజాల పని తీరే ఇందుకు నిదర్శనం. సంక్షోభాన్ని గట్టెక్కడానికి అమెరికా ఫెడ్ ఇటీవల వడ్డీ రేట్ల పెంపు ప్రయత్నాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్, మైక్రోసాఫ్ట్ల పనితీరు, అమ్మకాలు మందగించాయి. మరోవైపు ఆ టెక్ కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్ నిపుణుల అంచనాలను చేరలేకపోయాయి. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు నేల చూపులు చూస్తున్నాయి. గూగుల్ షేర్ విలువ ఆరు శాతం మేర పడిపోయింది. వ్యయాలు తగ్గించుకోవడంలో భాగంగా గూగుల్ తన తదుపరి తరం పిక్సల్ బుక్ ల్యాప్ట్యాప్ ప్రణాళికను రద్దు చేసింది. 'ఏరియా 120' పేరిట గూగుల్ ఏర్పాటు చేసిన స్టార్టప్ ఇంక్యుబేటర్కు ఇచ్చే నిధుల్లోనూ కోత పెట్టింది. ఇప్పటికే డిజిటల్ గేమింగ్ సర్వీస్ స్టూడియోను మూసివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో రానున్న రోజుల్లో టెక్ దిగ్గజాలు ఉద్యోగుల నియామకాల్ని తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి.
ప్రస్తుత ఏడాది సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో గూగుల్, యూట్యూబ్ అమ్మకాలు 6 శాతం మాత్రమే పెరిగాయి. కోవిడ్ తర్వాత ఇవే అత్యంత నిరాశకర ఫలితాలు కావడం గమనార్హం. ప్రకటనల మీద చేసే ఖర్చులను ఏకంగా 69 బిలియన్ డాలర్లు తగ్గించుకున్నట్లు గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ పేర్కొన్నారు. గతేడాది మూడో త్రైమాసికంలో ప్రకటనల ద్వారా 65.12 బిలియన్ డాలర్లు రాగా.. క్రితం క్యూ3లో ఇది 69.09 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యింది. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ సంస్థకు చెందిన కంప్యూటర్లు, ఇతర టెక్నలాజీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిందని పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఉత్పత్తుల విక్రయాలు 50 బిలియన్ డాలర్లకు పరిమితమయినట్లు పేర్కొంది. ఇది వరకుతో పోల్చితే 2022 డిసెంబర్ త్రైమాసికంలో నియామకాలను సగానికంటే తక్కువగా ఉంటాయని గూగుల్ తెలిపింది.
నియామక లేఖలు వెనక్కి..!
మాంద్యం చాయలతో ఐటి కంపెనీల్లో గందరగోళం చేసుకోవడంతో దిగ్గజ సంస్థలు ఇచ్చిన నియామక లేఖలపై వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. కొన్ని సంస్థలు నియామకాల్లో వేచి చూసే దోరణీని అవలంభిస్తున్నాయి. ఆఫర్ లేటర్లు పొందిన అభ్యర్థులకు చేరికలపై స్పష్టత నివ్వకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ముందు అన్ని అర్హతలు చూసి ఆఫర్ లేటర్లు ఇచ్చిన వారి నుంచి తప్పించుకోవడానికి సూక్ష్మ లోపాలు వెతికి వాటిని కారణంగా చూపుతున్నాయి. ఇప్పటికే ఫేస్బుక్ మాతృసంస్థ మేటా సంస్థలో 12 వేల మందికి ఉద్వాసన పలకనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ప్రముఖ చిప్ దిగ్గజ కంపెనీ ఇంటెల్ తమ 1.15 లక్షల మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందిని ఇంటికి పంపించాలని భావిస్తోన్నట్లు రిపోర్టులు వచ్చాయి. భారత్కు చెందిన ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ 2500 మందికి ఎసరు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ చర్యలు ఐటి కంపెనీ ఉద్యోగులు గుబులును రేపుతున్నాయి.










