యుఎస్ ఫెడ్కు ఎలన్ మస్క్ హెచ్చరిక
న్యూఢిల్లీ : అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోమారు కీలక వడ్డీ రేట్లను పెంచితే ఆర్థిక మాంద్యం మరింత ఎగిసిపడనుందని టెస్లా, ట్విట్టర్ కంపెనీల అధినేత ఎలన్ మస్క్ హెచ్చరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనిస్తోందని మస్క్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇక ఆపాలని ఇటీవల ఆయన సూచించారు. అమెరికాలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం తలెత్తక ముందే వడ్డీ రేట్లను తగ్గించాలన్నారు. ద్రవ్యోల్బణ కట్టడిలో భాగంగా ఫెడ్ ఇటీవల వరుసగా నాలుగోసారి 0.75 శాతం వడ్డీ రేటు పెంచింది. తుదగా నవంబర్లో పెంచిన రేట్లతో అమెరికాలో 3 నుంచి 3.25 శాతం మధ్య ఉన్న కనీస వడ్డీ రేటు 3.75 నుంచి 4 శాతానికి చేరింది. 2008 జనవరి తర్వాత అమెరికాలో వడ్డీరేట్లు ఇంత గరిష్ఠ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ప్రస్తుత డిసెంబర్ సమీక్షలోనూ మరో 0.50 శాతం, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి సమీక్షల్లో 0.25 శాతం చొప్పున పెంపు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కనీస వడ్డీ రేట్ల స్థాయి 5 శాతానికి చేరనున్నాయి.










