హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నానంటూ వదంతులు పుట్టిస్తున్నారని అన్నారు. పలువురు కార్యకర్తలు శనివారం భారీగా తరలిరావడంతో మైనంపల్లి నివాసం వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. కార్యకర్తలే ముఖ్యమని స్పష్టం చేశారు. అవసరమైతే కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని మైనంపల్లి వెల్లడించారు. తమ కోసం బయటకు వచ్చిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు.










