Nov 17,2022 20:55

హైదరాబాద్‌ : పేటియం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్‌ షేర్లు అమ్మకాల తాకిడితో కుప్పకూలాయి. గురువారం ఆ కంపెనీ షేర్‌ ఏకంగా 10 శాతం పైగా విలువ కోల్పోయింది. పేటియంలోని 4.5 శాతం వాటాకు సమానమయ్యే 2.95 కోట్ల షేర్లను సాఫ్ట్‌ బ్యాంక్‌ విక్రయించనున్నట్లు వచ్చిన రిపోర్టులు షేర్‌ పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఉదయం రూ.562.75 వద్ద ప్రారంభమైన సూచీ ఓ దశలో రూ.535 కనిష్టానికి పడిపోయింది. తుదకు 10.78 శాతం పతనంతో రూ.536.60 వద్ద ముగిసింది. గతేడాది నవంబర్‌లో ఈ కంపెనీ ఐపిఒకు వచ్చిన సమయంలో రూ.1,950 వద్ద లిస్టింగ్‌ అయ్యింది. ఆ తర్వాత నుంచి వరుసగా పడిపోతూ వస్తోంది. ఈ షేర్లలో పెట్టుబడులు పెట్టిన రిటైల్‌ ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. సెప్టెంబర్‌ 30 నాటికి పేటియంలో సాఫ్ట్‌బ్యాంక్‌కు 17.5 శాతం వాటా ఉంది.