Nov 22,2022 20:56
  • ఇన్వెస్టర్లకు భారీ నష్టం

న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక పేటియం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ ఇన్వెస్టర్లకు కడగండ్లను మిగిల్చుతోంది. విజరు శేఖర్‌ శర్మ నేతృత్వంలో ఈ కంపెనీ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.1 లక్ష కోట్లు ఆవిరియ్యింది. మంగళవారం సెషన్‌లో వన్‌ 97 కమ్యూనికేషన్‌ షేర్‌ మరో 11 శాతం పతనమై రూ.477కు పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.30,971 కోట్లకు పరిమితమయ్యింది. దీంతో పేటియం ఇష్యూ నాటి విలువతో పోల్చితే రూ.1 లక్ష కోట్లు హరించుకుపోయింది. ఈ మొత్తం ఇన్వెస్టర్లు నష్టపోయినట్లయ్యింది. గతేడాది నవంబర్‌లో ఐపిఒకు వచ్చిన సమయంలో ఈ షేర్‌ విలువ రూ.2,150గా ఉంది. ఆ సమయంలో మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.1.38 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఏడాది కాలంలోనే షేర్‌ విలువ 77 శాతం పతనమయ్యింది. దీంతో మదుపర్లకు భారీ కడగండ్లను మిగిల్చినట్లయ్యింది.
మార్కెట్లకు పిఎస్‌బిల మద్దతు
వరుసగా మూడు సెషన్లలో నష్టాలు చవి చూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభపడ్డాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీలు ప్రధాన మద్దతును అందించాయి. దీంతో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 274 పాయింట్లు పెరిగి 61,419కు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 89 పాయింట్లు రాణించి 18,249 వద్ద ముగిసింది.