Apr 08,2023 12:42

శ్రీలంకతో మూడో టీ20లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. క్వీన్స్‌టౌన్‌ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లంక ఓపెనర్లలో ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 73 పరుగులు, పాతుమ్‌ నిసాంక(25), కుశాల్‌ పెరెరా 21 బంతుల్లో 33, ధనంజయ డిసిల్వ 9 బంతుల్లోనే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ దసున్‌ షనక(15) మరోసారి నిరాశపరిచాడు. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ ఓపెనర్లలో టిమ్‌ సీఫర్ట్‌ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ 31 పరుగులతో రాణించాడు. చాడ్‌ బోవ్స్‌ (17), డారిల్‌ మిచెల్‌ (15), మార్క్‌ చాప్మన్‌ (16), జేమ్స్‌ నీషమ్‌ (0) నిరాశపరిచారు. ఈ క్రమంలో రెండు బంతుల్లో 2 పరుగులు చేయాల్సి స్థితిలో మరో బంతి మిగిలి ఉండగా రచిన్‌ రవీంద్ర రెండు పరుగులు తీసి కివీస్‌కు విజయం అందించాడు. సీఫర్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు అందుకున్నాడు.