Sep 16,2023 15:07

హైదరాబాద్‌ : తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య, మంచిర్యాల జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ప్రచార కమిటీ కో ఛైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్‌లో చేరారు. వీరితో పాటు వారి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరారు. 2009 సాధారణ ఎన్నికలు, 2010 ఉప ఎన్నికలు, 2014 సాధారణ ఎన్నికల్లో నల్లాల ఓదేలు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో ఓదేలుకు టికెట్‌ను నిరాకరించి బాల్క సుమన్‌కు సీటు ఇచ్చింది. దీంతో ఓదేలు తీవ్ర అసంతప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీగా గెలుపొందిన భాగ్యలక్ష్మికి జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. అయితే పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వడం లేదనే కారణంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు.