Nov 27,2022 21:30

ఢిల్లీ: పాత పెన్షన్‌ పథకం పునరుద్ధరణపై నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ బేరీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భవిష్యత్తు పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుందని తెలిపారు. ఆర్థిక పరిపుష్టి, సుస్థిర వఅద్ధిరేటును సాధించాల్సిన ఈ తరుణంలో ఇలాంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు అంతగా మంచి చేయవని హితవు పలికారు.
ఓపీఎస్‌లో పింఛను మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించేది. దీన్ని 2003లో అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. 2004 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పింఛను పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంట్లో ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి 10 శాతం పింఛను కింద జమచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు తమ వంతుగా 14 శాతం ఇస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఓపీఎస్‌ను అమలు చేయాలని నిర్ణయించాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న భాజపా రానున్న ఎన్నికల్లో గెలిస్తే ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఝార?ండ్‌ సైతం ఓపీఎస్‌ పద్ధతిలోకి మారాలని ఇటీవలే నిర్ణయించింది. మరోవైపు పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సైతం పాత పింఛను విధానంలోకి మారనున్నట్లు ప్రకటించింది.
మరోవైపు అధికారిక 'దారిద్య్ర రేఖ 'ను నీతి ఆయోగ్‌ ఎప్పుడు నిర్ణయిస్తుందని బేరీని ప్రశ్నించగా.. ప్రస్తుతం ఐరాస అభివఅద్ధి పథకం విడుదల చేస్తున్న 'బహుముఖ పేదరిక సూచీతో తాము సంతఅప్తిగానే ఉన్నామని తెలిపారు. పౌష్టికాహారం, విద్య, జీవనప్రమాణాలు సహా మొత్తం 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని దీన్ని మదింపు చేస్తున్నట్లు వెల్లడించారు. 'వినియోగదారుల వ్యయ సర్వే' ఫలితాలు వచ్చిన తర్వాతే కొత్త దారిద్య్ర రేఖను నిర్ణయించగలమని తెలిపారు. అది కేంద్ర గణాంకశాఖ వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉందన్నారు.