Mar 25,2023 09:29
  • వాంగ్‌ హ్యాట్రిక్‌, మెరిసిన స్కీవర్‌
  • యుపిపై 72 పరుగుల తేడాతో గెలుపు
  • 26న ఢిల్లీతో టైటిల్‌కై ఢీ

ముంబయి : మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) ఫైనల్లోకి ముంబయి ఇండియన్స్‌ జట్టు ప్రవేశించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి జట్టు 72 పరుగుల తేడాతో యుపి వారియర్స్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 182పరుగులు చేయగా.. ఛేదనలో వాంగ్‌ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో యుపి జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి పవర్‌-ప్లే 6ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 46పరుగులు చేసింది. స్కీవర్‌ బ్రంట్‌(72నాటౌట్‌; 38బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. ఆ తర్వాత మెల్లీ కెర్ర్‌(29; 19బంతుల్లో 5ఫోర్లు) రాణించడంతో స్కోర్‌బోర్డు పరుగెట్టింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(14) నిరాశపరిచింది. ఎక్లేస్టోన్‌కు రెండు, చోప్రా, శర్వానీకి ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో యుపి జట్టు పవర్‌ప్లే ఓవర్లు ముగిసేసరికే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో నవ్‌గైర్‌(43; 27బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) మెరిసినా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ నిరాశపరిచారు. వాంగ్‌ ఒకే ఓవర్‌లో నవ్‌గైర్‌, సిమ్రన్‌, ఎక్లేస్టోన్‌లను ఔట్‌ చేసి హ్యాట్రి నమోదు చేసింది. దీంతో యుపి గెలుపు ఆశలు నీరుగా రాయి. వాంగ్‌(4/16) బౌలింగ్‌లో మెరిసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వాంగ్‌కు లభించింది. 26న జరిగే ఫైనల్లో టైటిల్‌కై ముంబయి ఇండియన్స్‌జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.