Nov 13,2022 21:18

లండన్‌: చమురు శుద్ధి నుంచి టెలికాం వరకు వివిధ రంగాల్లోకి రిలయన్స్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ముకేశ్‌ అంబానీ తాజాగా పుట్‌బాల్‌ క్లబ్‌ 'లివర్‌పూల్‌ ఎఫ్‌సీ'ను కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత యజమాని ఫెన్‌వే స్పోర్ట్స్‌ గ్రూప్‌ (ఎఫ్‌ఎస్‌జీ) లివర్‌పూల్‌ ఎఫ్‌సీని విక్రయించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు గోల్డ్‌మన్‌ శాక్స్‌, మోర్గాన్‌ స్టాన్లీని నియమించుకుంది. 4 బిలియన్‌ బ్రిటిష్‌ పౌండ్లకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ముకేశ్‌ అంబానీ క్లబ్‌ పూర్వాపరాలను ఆరా తీసినట్లు 'ది మిర్రర్‌' తెలిపింది. ఈ క్లబ్‌లో వాటాదారులుగా మారేందుకు అనేక థర్డ్‌ పార్టీ సంస్థలు తమకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను పంపాయని ఎఫ్‌ఎస్‌జీ తెలిపింది. అయితే, క్లబ్‌ ప్రయోజనాలను దఅష్టిలో ఉంచుకొని కొత్త వాటాదారులను చేర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.
అంబానీ ఇప్పటికే భారత టీ20 లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ టీమ్‌కి యజమానిగా ఉన్నారు. మరోవైపు ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌లో 'ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌'కు వాణిజ్య భాగస్వామిగానూ కొనసాగుతున్నారు.