Apr 20,2023 21:17
  • ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1

అంటల్యా(టర్కీ): భారత పురుషుల ఆర్చరీ జట్టు ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 ఫైనల్లోకి దూసుకెళ్లింది. అతాను దాస్‌, బి. ధీరజ్‌, తరున్‌ దీప్‌రారులతో కూడిన భారత జట్టు సెమీస్‌లో 5-4 ఫ్రేముల తేడాతో జపాన్‌పై గెలిచింది. నాల్గో ర్యాంకర్‌గా బరిలోకి దిగిన పురుషుల బృందానికి తొలిరౌండ్‌లో బై లభించగా.. క్వార్టర్‌ఫైనల్లో చైనీస్‌ తైపీపై 6-2తో, ప్రి క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌పై 6-2తో గెలిచి సెమీస్‌కు చేరింది. ఇక ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో భారత్‌ షూట్‌-ఆఫ్‌లో 5-4(29-28)తో జపాన్‌పై సంచలన విజయం సాధించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారతజట్టు చైనాతో తలపడనుంది. ఇక భజన్‌ కౌర్‌, సిమ్రంజీత్‌ కౌర్‌, అంకితా భగత్‌లతో కూడిన మహిళలజట్టు షూట్‌-ఆఫ్‌లో 5-4(24-19)తో బ్రెజిల్‌ను ఓడించినా.. స్పెయిన్‌ చేతిలో 2-6 తేడాతో ఓడి ఫైనల్‌కు చేరలేకపోయింది. ఇక మహిళల వ్యక్తిగత విభాగం కాంపౌండ్‌ సెమీస్‌ బెర్త్‌కు వెన్నం జ్యోతి సురేఖ శుక్రవారం తలపడనుంది.