Aug 09,2023 11:46

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సూపర్‌ మాస్‌ ఎంటర్‌ టైనర్‌ 'గుంటూరు కారం' కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) ఈ సూపర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆగష్టు 9న సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా, స్టైలిష్‌ మాస్‌ అవతార్‌లో కనిపిస్తున్న మహేష్‌ బాబు సూపర్‌ మాస్‌ పోస్టర్‌లను చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్‌లో లుంగీ కట్టుకొని, కళ్లద్దాలు పెట్టుకొని, బీడీ కాలుస్తున్న మహేష్‌ బాబు లుక్‌, అలాగే మరో చిత్రంలో జీన్స్‌, బ్లాక్‌ టీ షర్ట్‌పై రెడ్‌ కలర్‌ షర్ట్‌, ఎర్రని తలపాగా తో ప్రత్యర్థులతో తలపడుతున్నట్లుగా మహేష్‌ కనిపిస్తున్న వైనం కట్టిపడేస్తోంది.
ఇప్పటికే సూపర్‌ స్టార్‌ కృష్ణ గారి జయంతి సందర్భంగా మాస్‌ స్ట్రైక్‌ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌ అద్భుతమైన స్పందనతో వైరల్‌ గా మారిన విషయం తెలిసిందే. గ్లింప్స్‌కి ఎస్‌.థమన్‌ అందించిన నేపథ్య సంగీతం విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అత్యంత విజయవంతమైన కలయికగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్‌-థమన్‌ కాంబినేషన్‌ పై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకొని.. థమన్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు. గుంటూరు కారం షూటింగ్‌ను ఆగస్టు ద్వితీయార్థంలో పున్ణప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మరో కథానాయికగా నటిస్తున్నారు. టైటిల్‌ కి తగ్గట్లుగానే, గుంటూరు కారం చాలా ఘాటుగా ఉంటుందని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.