Mar 26,2023 22:02

ఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ పతకాల వరద పారించింది. ఇప్పటికే మూడు స్వర్ణాలను తన ఖాతాలో వేసుకున్న భారత్‌.. తాజాగా మరో పసిడి కొల్లగొట్టింది. నీతు గంగాస్‌, స్వీటీ, జరీనా బంగారు పతకాలు సాధించగా.. తాజాగా 75 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గోహెయిన్‌ స్వర్ణాన్ని ముద్దాడింది. ఆస్ట్రేలియాకు చెందిన కైత్లిన్‌ పార్కర్‌పై 5-2 తేడాతో విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన లవ్లీనా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సాధించడం ఇదే తొలిసారి. కాగా, తాజా విజయంతో మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 4 స్వర్ణాలు గెలిచినట్లయింది.
శనివారం జరిగిన ఫైనల్‌ పోరులో 48 కేజీల విభాగంలో నీతూ 5-0 తేడాతో మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్‌ చిత్తు చేయగా..81 కేజీల విభాగం టైటిల్‌ పోరులో స్వీటీ 4-3 తేడాతో చైనాకు చెందిన వాంగ్‌ లీనాపై పోరాడి గెలిచింది. మరోవైపు ఇవాళ జరిగిన 50 కిలోల విభాగంలో తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ పసిడి కొల్లగొట్టింది. ప్రత్యర్థి, రెండు సార్లు ఆసియా ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న వియత్నాంకు చెందిన న్యూయెన్‌ టాన్‌పై 5-0తో విజయం సాధించింది. నిఖత్‌ జరీన్‌ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టింది.