Nov 14,2022 21:58
  • నష్టపోయిన సెన్సెక్స్‌

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) షేర్లు కొనుగోళ్ల మద్దతుతో సోమవారం పరుగులు పెట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 11 రెట్ల వృద్థితో రూ.15,952 కోట్ల నికర లాభాలు సాధించడంతో ఎల్‌ఐసి షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంట్రాడేలో ఏకంగా 9 శాతం పెరిగి రూ.684.9కు చేరింది. బిఎస్‌ఇలో తుదకు 5.85 శాతం లాభపడి రూ.664.80 వద్ద ముగిసింది. ఉదయం రూ.666 వద్ద ప్రారంభమైన సూచీ ఓ దశలో రూ.654.60 కనిష్టానికి తగ్గి.. మరో దశలో రూ.682.70 గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. మరోవైపు బిఎస్‌ఇ సెన్సెక్స్‌ అమ్మకాల ఒత్తిడితో 171 పాయింట్లు పడిపోయి 61,624కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 29 పాయింట్లు తగ్గి 18,329 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌-30లో డాక్టర్‌ రెడ్డీస్‌ అత్యధికంగా 4 శాతం పతనం కాగా.. ఐటిసి, హెచ్‌యుఎల్‌, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్‌, నెస్ట్లే ఇండియా స్టాక్స్‌ అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి.