Dec 19,2022 20:38

న్యూఢిల్లీ : భారత్‌లో రెండో అతి పెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ ఓ ఆస్ట్రేలియా ప్రాజెక్టు అంశంలో తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ సంస్థ పొందిన 135 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1100 కోట్లు) విలువ చేసే కాంట్రాక్టుపైన ఆస్ట్రేలియా ప్రభుత్వం విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు పలు రిపోర్టులు వచ్చాయి. ఆ దేశ ప్రభుత్వం ఓ కాంట్రాక్టును టెక్‌ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా.. ఈ ప్రాజెక్టు, కాంట్రాక్టు గురించి ఆ దేశ ప్రభుత్వ అధికార పార్టీ లిబరల్‌ పార్టీ ఆఫ్‌ ఆస్ట్రేలియా ఎంపి సువార్ట్‌ రాబర్ట్‌ ఇన్ఫోసిస్‌తో పాటు తన మిత్రుడు, వ్యాపార భాగస్వామి జాన్‌ మార్గెరిసన్‌కు చెందిన కన్సల్టెంగ్‌ సంస్థ సినర్జీ 360తో పాటు మరో కంపెనీ యూనిసిస్‌కు లీక్‌ చేశారని బయటికి వచ్చింది. సున్నితమైన ఈ కాంట్రాక్టు లీకులతో ఇన్ఫోసిస్‌ సులభంగా ఆ ప్రాజెక్టును దక్కించుకుందని ప్రధాన అరోపణ. ఎంపి తన అధికారంతో ప్రయివేటు, కార్పొరేటు శక్తులకు కొమ్ముకాశారని అక్కడి మీడియా కథనాలను ప్రచురించింది. దీంతో ఇన్ఫోసిస్‌కు కట్టబెట్టిన ప్రాజెక్టు పైన విచారణ, సమీక్షా చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఎమైనా అవినీతి జరిగిందా అనే కోణంలో అస్ట్రేలియన్‌ ప్రభుత్వం విచారణ చేపట్టనుందని సమాచారం.