Dec 12,2022 18:58

న్యూఢిల్లీ : దేశంలో వస్తువులకు డిమాండ్‌ లేక తయారీ రంగం డీలా పడుతోంది. ఈ ప్రభావం పారిశ్రామికోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో భారత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) 4 శాతానికి పడిపోయిందని కేంద్ర గణంకాల శాఖ సోమవారం ఓ నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే మాసంలో ఐఐపి 4.2 శాతం వృద్థిని కనబర్చింది. గడిచిన అక్టోబర్‌ మాసంలో తయారీ రంగం ఏకంగా 5.6 శాతం క్షీణించగా, గనులు, విద్యుత్‌ రంగాలు వరుసగా 2.5 శాతం, 1.2 శాతం చొప్పున పెరిగాయి. ఐఐపిలో భాగమైన కాపిటల్‌ గూడ్స్‌ (ఉత్పాదక వస్తువులు), ఇంటర్మీడియట్‌ గూడ్స్‌, కన్స్యూమర్‌ డ్యూరెబుల్స్‌ (గృహోపకరణాలు), కన్స్యూమర్‌ నాన్‌ డ్యూరెబుల్స్‌ (వాడి పారేసేవి, పాద రక్షలు, వస్త్రాలు తదితర) సూచీలు వరుసగా 2.3 శాతం, 2.8 శాతం, 15.3 శాతం, 13.4 శాతం చొప్పున పతనమయ్యాయి. మరోవైపు ప్రాథమిక ఉత్పత్తులు, మౌలిక వసతులు వరసగా 2 శాతం, 1 శాతం చొప్పున పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ కాలంలో భారత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ పెరుగుదల 5.3 శాతానికి పరిమితమయ్యింది. గతేడాది ఇదే సమయంలో ఏకంగా 20.5 శాతం వృద్థి చోటు చేసుకుంది.

  • 5.88 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

ప్రస్తుత ఏడాది నవంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 5.88 శాతంగా నమోదయ్యింది. గత కొన్ని నెలలుగా ఈ సూచీ ఆరు శాతం ఎగువన నమోదవుతూ ప్రభుత్వం, ఆర్‌బిఐని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. 2023 అక్టోబర్‌లో ఈ సూచీ 6.77 శాతంగా ఉంది. గడిచిన నెలలో ముఖ్యంగా అహార పదర్థాల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం దిగివచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.