May 17,2023 21:36
  • శాఫ్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: బెంగళూరు వేదికగా జరగనున్న శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. గ్రూప్‌-ఏలో భారత్‌తో పాటు పాకిస్తాన్‌, నేపాల్‌, కువైట్‌ దేశాలున్నాయి. మరో గ్రూప్‌లో లెబనాన్‌, మాల్దీవ్స్‌, బూటాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, ఆతిథ్య భారత్‌ 2021 ఫైనల్లో నేపాల్‌ను ఓడించి ఎనిమిదోసారి శాఫ్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ను గెలుచుకుంది. కువైట్‌, లెబనాన్‌ జట్లు దక్షిణాసియాలో లేనప్పటికీ ఈ టోర్నమెంట్‌ను మరింత పోటీగా నిర్వహించడానికి ఆతిథ్య దేశాలుగా ఆహ్వానించడం జరిగింది. ఫిఫా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లను సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో ఈ రెండు జట్లకు చోటు కల్పించడం జగిందని శాఫ్‌ సెంట్రల్‌ ఆసియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2021 నుంచి ఫిఫా పాకిస్తాన్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో తిరిగి టోర్నమెంట్‌ బరిలోకి దిగుతోంది. 2018లో జరిగిన 12వ శాఫ్‌ టోర్నమెంట్‌ సెమీఫైనల్లో భారతజట్టు 3-1గోల్స్‌ తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్లో మాల్దీవుల చేతిలో 1-2గోల్స్‌తో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఇక శాఫ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ బెంగళూరులో జూన్‌ 21 నుంచి జులై 4వరకు జరగనుంది.
శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌ డ్రా...
గ్రూప్‌-ఏ : ఇండియా, కువైట్‌, నేపాల్‌, పాకిస్తాన్‌
గ్రూప్‌-బి : లెబనాన్‌, మాల్దీవ్స్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌