అమరావతి: 'న్యూస్ క్లిక్'పై కేంద్ర ప్రభుత్వ దాడులు, అక్రమ అరెస్టులను సిఐటియు ఎపి కమిటీ ఖండించింది. ఈ మేరకు సిఐటియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్ నరసింగరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీతో సహా వివిధ నగరాల్లో న్యూస్ క్లిక్ మీడియా సంస్థపై క్రూరమైన యుపిఎ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అక్రమంగా కేసులు నమోదు చేసి జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు, కార్టూనిస్టులు, విమర్శకుల ఇళ్లపై ఢిల్లీ పోలీసులు దాడులు చేయడం దుర్మార్గమన్నారు. న్యూస్ క్లిక్పై దాడి అంటే ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా సిఐటియు పేర్కొంది.










