Mar 08,2023 16:53

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో అద్భుత విజయాలను నమోదు చేసిన టీమ్‌ఇండియా మూడో మ్యాచ్‌లో ఓటమి చెందింది. 'అతి విశ్వాసమే' మూడో టెస్టులో టీమ్‌ఇండియా కొంపముంచిందని ఓటమి అనంతరం కామెంటరీ బాక్స్‌లో ఉన్న రవిశాస్త్రి వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఘాటుగా స్పందించాడు. మేం అన్ని మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నప్పుడు.. బయటి వ్యక్తులు చేసే ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోం' అని రోహిత్‌ స్పష్టం చేశాడు. ''మేం నాలుగు మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నిస్తాం. రెండు మ్యాచ్‌ల్లో గెలవడం ద్వారా మనం ఆగిపోకూడదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే బయటి వ్యక్తులు.. ముఖ్యంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో భాగం కాని వాళ్లకు.. మా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం చర్చ జరుగుతుందో వాళ్లకు ఏం తెలుస్తుంది'' అంటూ రోహిత్‌ మండిపడ్డారు.