Jun 02,2023 22:10

లండన్‌: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి) టైటిల్‌ దక్కాలంటే బ్యాటర్స్‌ రాణిస్తేనే అది సాధ్యం కానుంది. లండన్‌లోనికెన్నింగ్టన్‌ ఓవల్‌ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్లో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. 2021-23 టెస్ట్‌ సిరీస్‌ సైకిల్‌లో ఆస్ట్రేలియా 19టెస్టుల్లో 66.67పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్‌ 18మ్యాచుల్లో 58.8పాయింట్లతో రెండోస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరాయి. ఇక భారతజట్టు డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి. రెండేళ్ల క్రితం ఫైనల్లో భారతజట్టు న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలై ట్రోఫీని అందుకోలేకపోయింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో బోర్డర్‌గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా 4టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-1తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతజట్టు మరోసారి ట్రోఫీని చేజార్చుకోకుండా ఉండాలంటే బ్యాటర్స్‌ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ విశ్లేషకులు అంటున్నారు. రోహిత్‌-స్టార్క్‌, స్మిత్‌ాఅశ్విన్‌తో పోల్చుతున్నారు. ఇక ఆస్ట్రేలియా జట్టు పాట్‌ కమ్మిన్స్‌, మిఛెల్‌ స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, నాథన్‌ లియాన్‌ వంటి బౌలర్లతో బలీయంగా ఉండగా.. భారతజట్టు జస్ప్రీత్‌ బుమ్రా దూరమైనా.. మహ్మద్‌ షమీ బౌలింగ్‌ భారాన్ని తన భుజాలపై మోయనున్నాడు.
అప్పటి పొరపాటును మళ్లీ చేయొద్దు: ఎంఎస్‌కె ప్రసాద్‌
వరుసగా రెండోసారి డబ్ల్యూటిసి ఫైనల్‌కు చేరిన భారత్‌ విజేతగా నిలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. జూన్‌ 7 నుంచి ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. తుది జట్టు ఎంపికపై టీమిండియా మేనేజ్‌మెంట్‌ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. బౌలింగ్‌ విభాగంపైనే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కె ప్రసాద్‌ కీలక సూచనలు చేశాడు. గత ఫైనల్‌లో చేసిన పొరపాట్లను మరోసారి పునరావృతం చేయొద్దని పేర్కొన్నాడు. కివీస్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ పిచ్‌ పేస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇద్దరు స్పిన్నర్లతో భారత్‌ బరిలోకి దిగింది. ఇలాంటి నిర్ణయమే టీమిండియా నష్టం చేసింది. ఇప్పుడు మరోసారి అలా కాకుండా ఉండాలంటే పిచ్‌ పరిస్థితికి అనుకూలంగా జట్టును ఎంపిక చేయాలని ఎంఎస్‌కె స్పష్టం చేశారు. అలాగే రిషభ్‌ పంత్‌ లేని లోటును తీర్చడం కష్టమేని చెప్పాడు. అలాగే గత ఫైనల్‌ మ్యాచ్‌కు మనం ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లతో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాం. కానీ, వర్షం పడటంతో పిచ్‌ పరిస్థితి మారిపోయింది. అయినా సరే తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు స్థానం కల్పించి కివీస్‌తో మ్యాచ్‌ ఆడేశాం. కానీ, ఇప్పుడు మాత్రం ఆసీస్‌తో తలపడే ఓవల్‌ పిచ్‌ కండీషన్‌ను బట్టి తుది జట్టు ఎంపిక ఉండాలి. ఐదు రోజులపాటు ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. అందుకే, ఒకే ప్లాన్‌కు ఫిక్స్‌ అయిపోకుండా ఉండాలి.