Oct 06,2023 14:27

హనుమకొండ: దేశంలో భవిష్యత్‌ అంతా ద్వితీయశ్రేణి నగరాలదే అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేలా వరంగల్‌, ఖమ్మం, నల్గండ వంటి నగరాలు, పట్టణాలకు పరిశ్రమలు తీసుకువస్తోందని చెప్పారు. వరంగల్‌, హనుమకొండలో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్‌..900కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మడికొండ ఐటీ పార్క్‌లో 40కోట్లతో ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఆయన ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా 500మందికి ఉపాధి లభించనుంది. అనంతరం జరిగిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు. ''రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌కు వరంగల్‌కు తేడా ఉండదు. ఐటీ రంగంలో భవిష్యత్‌ అంతా టైర్‌ 2 నగరాలదే. వరంగల్‌లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలి. అక్కడా ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరుతున్నాను. కావాలంటే జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తాను. బెంగళూరు ఐటీ రంగంలో 40శాతం తెలుగువాళ్లే. అక్కడి నుంచి వచ్చేందుకు తెలుగు ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఉన్నచోటే మన యువతకు ఉపాధి దక్కాలి. కులం, మతం పేరుతో కొట్టుకుచావడం మానాలి'' అని కేటీఆర్‌ అన్నారు.