Dec 06,2022 21:00
  • అమ్మకానికి మెజారిటీ వాటాలు

న్యూఢిల్లీ : లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి), ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడిబిఐ బ్యాంక్‌ను విదేశీ శక్తుల పరం చేయడానికి మోడీ సర్కార్‌ ఆసక్తిగా ఉంది. ఈ బ్యాంక్‌ను అమ్మే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఇందులోని 51 శాతం పైగా వాటాలను విదేశీ కన్సోరియం కొనుగోలు చేయడానికి వీలు కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దేశంలో నూతన ప్రయివేటు బ్యాంక్‌ల ఏర్పాటులో విదేశీ యాజమాన్యాన్ని పరిమితం చేస్తాయి. అయితే ఈ నిబంధనలు కొత్త ప్రయివేటు బ్యాంక్‌లకు మాత్రమే వర్తిస్తాయని.. ప్రస్తుతం ఐడిబిఐ బ్యాంక్‌ లాంటి వాటికి వర్తించవని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) పేర్కొంది. ఇదే విషయాన్ని బిడ్డర్ల అనుమానాలకు ఓ సమాధానంగా తెలిపింది. ఐడిబిఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటాల స్వాధీనానికి వీలుగా డిసెంబర్‌ 16 వరకు బిడ్డింగ్‌లను అహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో ఎల్‌ఐసి, కేంద్రానికి కలిపి 95 శాతం వాటా ఉంది. ఇందులోని 60.72 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రంగా ఆసక్తిగా ఉంది. ఐడిబిఐ బ్యాంక్‌లో ప్రస్తుతం ఎల్‌ఐసికి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం, నాన్‌ ప్రమోటర్‌ షేర్‌హోల్డర్లకు 5.29 శాతం చొప్పున వాటాలున్నాయి. ఇందులో ఎల్‌ఐసి, ప్రభుత్వ వాటాల్లో ఎంత చొప్పున ఉపసంహరించుకునేది మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు.