Feb 18,2023 21:55

ఇంగ్లండ్‌ చేతిలో 11పరుగుల తేడాతో పరాజయం
ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌

కేప్‌టౌన్‌: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా ఇంగ్లండ్‌ చేతిలో 11 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 151పరుగులు చేసింది. ఛేదనలో భారతజట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్లు కోల్పోయి 140పరుగులే చేయగల్గింది. టాస్‌ గెలిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తొలిగా బౌలింగ్‌ను ఎంచుకుంది. ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను రేణుక కట్టడి చేయడంతో ఇంగ్లండ్‌ జట్టు 29పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో స్కీవర్‌(50), జోన్స్‌(40), కెప్టెన్‌ నైట్‌(28) బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 151పరుగులు చేసింది. రేణుకకు ఐదు, శిఖాపాండే, దీప్తి శర్మకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో టీమిండియా ఓపెనర్‌ స్మృతి మంధాన(52) రాణించినా.. షెఫాలీ(8), రోడ్రిగ్స్‌(13), హర్మన్‌ ప్రీత్‌(4) నిరాశపరిచారు. ఆ తర్వాత రీచా ఘోష్‌(47) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినా ప్రయోజనం లేకపోయింది. చివరి ఓవర్లు 30పరుగులు చేయాల్సి దశలో రీచా 18పరుగులు రాబట్టింది. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 140పరుగులే చేయగల్గింది. గ్లెన్‌కు రెండు, ఎక్లేస్టోన్‌, బెల్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ స్కీవన్‌కు లభించింది. ఇక గ్రూప్‌-బిలో శుక్రవారం అర్ధరాత్రి మరో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు 6వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. ఐర్లాండ్‌ జట్టు 20 ఓవర్లలో 9వికెట్లు నష్టపోయి 139పరుగులు చేస్తే.. విండీస్‌ జట్టు 19.5ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 140పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మాథ్యూస్‌కు లభించింది.
మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు..
పాకిస్తాన్‌ × వెస్టిండీస్‌(సా.6.30గం||లకు)
న్యూజిలాండ్‌ × శ్రీలంక(రా.10.30గం||లకు)