Jun 14,2023 21:05
  • సింగిల్స్‌ విజేతకు రూ.24.44కోట్లు, రన్నరప్‌కు రూ.12.22కోట్లు

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆటగాళ్లకిచ్చే ప్రైజ్‌ మనీ మరోసారి భారీ పెరిగింది. గత ఏడాదితో ఈసారి ఆటగాళ్లకిచ్చే ప్రైజ్‌మనీని 11.2 శాతం పెంపుదల చేస్తున్నట్లు ఇంగ్లండ్‌ లాన్‌ టెన్నిస్‌ అండ్‌ క్రోకెట్‌ క్లబ్‌(ఎఇఎల్‌టిసి) నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో ఈ ఏడాది మొత్తం 44.7మిలియన్‌ పౌండ్స్‌(రూ.465కోట్లు) ప్రైజ్‌ మనీని అందజేయనున్నారు. సింగిల్స్‌ విజేత 2.35 మిలియన్‌ పౌండ్స్‌(రూ.24.44కోట్లు), రన్నరప్‌ విజేత రూ.1.175మిలియన్‌ పౌండ్స్‌(రూ.12.22కోట్లు) ప్రైజ్‌ మనీ అందుకోనున్నారు. ఇది గత ఏడాదితో పోల్చిచూస్తే 1.7మిలియన్‌ పౌండ్స్‌, అంతకుముందు ఏడాదితో పోల్చిచూస్తే 2మిలియన్స్‌ పౌండ్స్‌ అధికం. అలాగే పురుషుల, మహిళల డబుల్స్‌ విజేతలకు అందజేసే ప్రైజ్‌ మనీని 10.7 శాతం పెంపుదల చేశారు. వీల్‌ఛైర్‌ మరియు క్వాడ్‌ వీల్‌ఛైర్‌ సింగిల్స్‌, డబుల్స్‌ విజేతలకు అందజేసే ప్రైజ్‌ మనీని 20శాతం పెంపుదల చేశారు. 2019లో తొలిసారి ఆటగాళ్లకు అందజేసే ప్రైజ్‌ మనీని పెంచిన నిర్వాహకులు తాజాగా మరోసారి భారీగా ప్రైజ్‌ మనీని పెంపుదల చేశారు. అలాగే క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఆటగాళ్లకిచ్చే ప్రైజ్‌ మనీలోనూ 14.5శాతం పెంపుదల కనిపించింది. ఇక మొయిన్‌ డ్రా తొలిరౌండ్‌ విజేత 10శాతం పెంపుదలతో 55వేల పౌండ్స్‌(రూ.57లక్షలు) అందుకోనున్నాడు. గత ఏడాది తొలిరౌండ్‌ విజేతకు 10.7శాతం ప్రైజ్‌ మనీ దక్కితే.. అది ఈసారి 20శాతానికి పెరిగింది. ఈ మేరకు ఆల్‌ ఇంగ్లండ్‌ క్లమ్‌ ఛైర్మన్‌ ఇవాన్‌ హెవిట్‌ అధికారికంగా ప్రైజ్‌ మనీ పెంపుదల విషయాన్ని వెల్లడించారు.