Oct 12,2023 21:02

- కెవైసి నిబంధనల అమల్లో విఫలం
- ఆ సంస్థకు రూ.5.39 కోట్ల పెనాల్టీ
- ఆర్‌బిఐ చర్యలు
ముంబయి : పేటియం పేమేంట్స్‌ బ్యాంక్‌కు రిజర్బ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీ షాక్‌ ఇచ్చింది. ఆర్‌బిఐ నిబంధనలను పాటించడంలో పేటియం విఫలం కావడంతో ఆ సంస్థకు రూ.5.39 కోట్ల జరిమానా విధించింది. ఈ విషయమై ఆర్‌బిఐ ఓ ప్రకటన విడుదల చేయగా.. పేటియం రెగ్యూలేటరీ సంస్థల ఫైలింగ్‌లో తెలిపింది. పేమెంట్స్‌ బ్యాంక్స్‌ లైసెన్సింగ్‌కు సంబంధించి ఆర్‌బిఐ మార్గదర్శకాలు, బ్యాంకుల సైబర్‌ సెక్యూరిటీ, ప్రేమ్‌వర్క్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ భద్రతకు నిర్దేశించిన నిబంధనలను పాటించడంలో విఫలమయ్యిందని ఆర్‌బిఐ పేర్కొంది. 'ఆర్‌బిఐ కెవైసి నిబంధనలు 2016' గైడ్‌లైన్స్‌ అమలు చేయలేదని పేర్కొంది. తాము ఈ లోపాలను గుర్తించామని వెల్లడించింది. యాంటీ మనీలాండరింగ్‌ కోణంలో ప్రత్యేక పరిశీలన జరిపామని పేర్కొంది. ఆర్‌బిఐ గుర్తించిన ఆడిటర్లతో పేటియం పేమెంట్‌ బ్యాంక్‌లో సమగ్ర సిస్టమ్‌ ఆడిట్‌ నిర్వహించామని వెల్లడించింది. ఈ క్రమంలోనే వ్యాపారులకు అందించే సర్వీసు అయినా పేఔట్‌ సర్వీసులకు సంబంధించి సంస్థ యజమానులను గుర్తించడంలో పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌ విఫలమైనట్లు తేలిందని తెలిపింది.
పేఔట్‌ లావాదేవీలకు సంబంధించి ఆయా సంస్థల రిస్క్‌ అంశాలను పర్యవేక్షణ చేయడంలోనూ విఫలమైందని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. పేఅవుట్‌ సేవలు ఖాతాదారుల అడ్వాన్స్‌ ఖాతాల్లో ఎండ్‌ ఆఫ్‌ ది డే బ్యాలెన్స్‌కు సంబంధించి నిర్దేశించిన పరిమితిని పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు ఆర్‌బిఐ పేర్కొంది. తాము గుర్తించిన ఉల్లంఘనలపై ఎందుకు జరిమానా విధించకూడదో వివరణ ఇవ్వాలని పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌కు నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆ సంస్థ ఇచ్చిన రాతపూర్వక సమాధానంతో పాటుగా వ్యక్తిగత విచారణలోని సమాధానాలకు ఆర్‌బిఐ సంతృప్తి చెందినట్లు లేదని సమాచారం. నిబంధనలు ఉల్లంఘించనందుకే ఈ జరిమానా వేసినట్లు ఆర్‌బిఐ పేర్కొంది. దీంతో సాధారణ ఖాతాదారుల లావాదేవీలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గురువారం బిఎస్‌ఇలో పేటియం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ షేర్‌ ధర 1.47 శాతం పడిపోయి రూ.957.60 వద్ద ముగిసింది.