Jul 04,2023 22:09

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) విడుదల చేసిన తాజా వన్డే బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన టాప్‌-5లో చోటు కోల్పోయారు. ఐసిసి మంగళవారం ప్రకటించిన వన్డే బ్యాటర్స్‌ జాబితాలో భారత మహిళలజట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 6వ, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన 7వ స్థానంలో నిలిచారు. హర్మన్‌ ఖాతాలో 716పాయింట్లు, స్మృతి ఖాతాలో 714పాయింట్లు ఉన్నాయి. తాజా వన్డే బ్యాటర్స్‌ జాబితాలో శ్రీలంక కెప్టెన్‌ ఛమారి ఆటపట్టు(758పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచింది. ఇక బౌలర్ల జాబితాలో ఎడమచేతి వాటం స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ 617పాయింట్లతో 8వ, దీప్తి శర్మ 10వ స్థానంలో నిలిచారు. తాజా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లేస్టోన్‌ 751పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక టి20 బ్యాటర్స్‌ జాబితాలో స్మృతి మంధాన 722పాయింట్లతో 3వ స్థానంలో నిలువగా.. దీప్తి శర్మ బౌలర్ల జాబితాలో 729పాయింట్లతో 4వ స్థానంలో, రేణుక సింగ్‌ 700పాయింట్లతో 9వ స్థానాల్లో నిలిచారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ 393పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది. శ్రీలంకకు చెందిన ఆటపట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 2-1తో గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించడంతో ఆమె ర్యాంక్‌ మెరుగైంది.